దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6128 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జులై 1 నుంచి జులై 21 మధ్య ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. 2025-2026 సంవత్సరానికి ఐబీపీఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్(CRP)-XIV పేరుతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ మొత్తం 6128 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఖాళీలున్నాయి. ఏపీలో 105, తెలంగాణలో 104 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే దరఖాస్తుదారులు జులై 2, 1996 నుంచి జులై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
ప్రిలిమినరీ, మెయిన్స్ రెండు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ లలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు 850 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.175. ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు నెలలో జరగనుంది. సెప్టెంబర్ లో రిజల్ట్స్, అక్టోబర్ నెలలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.