టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)లో కొలువుల జాతర షురూ కాబోతోంది. తాజాగా 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.
టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)లో కొలువుల జాతర షురూ కాబోతోంది. రీసెంట్ గా మహాలక్ష్మి స్కీం తీసుకొచ్చి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. TGSRTCలో 3035 ఉద్యోగాల భర్తీకి స్వీకారం చుట్టింది. ఈ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారు. అయితే కారుణ్య నియామకాలు మినహా గత పదేళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు జరగలేదని, సీఎం రేవంత్రెడ్డి చొరవతో ఇప్పుడు భారీ ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని గతంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాజాగా అందుకు మార్గం సుగమమైంది. TGSRTC లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు ఆర్టీసీ అధికారులు.
రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీం కింద మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలోనే పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించి, ఆ మేరకు కొత్త నియామకాలు చేపడుతోంది. ఈ ఉద్యోగ నియామకాల్లో డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉంది. రోడ్లపైకి కొత్త బస్సులు రాబోతున్నాయి కాబట్టి ఎక్కువ మంది స్టాఫ్ అవసరం అవుతారని భావించి ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులకు సంబంధించి మరింత సమాచారం అతి త్వరలో తెలియనుంది.