ఏపీలో ఇటీవల అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్.. ప్రజా సంక్షేమంతో పాటు చదువు, ఉద్యోగాల విషయంలో కీలక అడుగులు వేస్తోంది. యువతకు మేలు కలిగే అడుగులేస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో డిసీజన్ తీసుకుంది ప్రభుత్వం.
ప్రస్తుతం ఒకేషనల్ రంగంలో భారీ ఉపాధి అవకాశాలు ఉండడంతో ఏపీఎస్ఎస్డీసీ (నైపుణ్యాభివృద్ధి సంస్థ) దీనిపై ఫోకస్ పెట్టి ముందుకు సాగుతోంది. డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగ యువతకు ఈ రంగంలో అవకాశాలు కల్పించాలని కీలక ప్రణాళికలు చేసింది.
రాష్ట్రంలో డిగ్రీ లోపు చదువు ఉన్న వారు 1.10 కోట్ల మంది ఉన్నారని అంచనా. అయితే వీళ్లకు ఒకేషనల్ రంగంలో నైపుణ్య శిక్షణ చేపట్టి ఉపాధి కల్పించబోతోంది. ఒకేషనల్ ఉద్యోగాల్లో ప్రారంభంలో టెక్నీషియన్కు రూ.15 నుంచి 18 వేల జీతం వస్తుండగా.. రెండేళ్ల అనుభవం తర్వాత సూపర్వైజర్ అయితే రూ.30- 40వేల జీతం వస్తోంది. అనుభవం వచ్చాక భవిష్యత్తులో సొంత కంపెనీలను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి రివలూష్యనరీ సంస్థ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కూడా ఇస్తోంది. ఇప్పటికే విజయవాడలో ఎలక్ట్రీషియన్ శిక్షణ ఇస్తున్న ఈ సంస్థ మరో రెండు వారాల్లో నెల్లూరు జిల్లా కందుకూరులోనూ శిక్షణ ప్రారంభించనుంది.
ఈ శిక్షణ కాలం 2-3 వారాలు ఉంటుంది. ఈ సమయంలో లేటెస్ట్ టూల్కిట్పై శిక్షణ ఇచ్చి, కిట్ను అందిస్తున్నారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుంది. ఈ సంస్థ ఏడాదికి 7వేల ఉద్యోగాలు కల్పిస్తుండటం విశేషం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నారు.
నాన్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చే సంస్థలను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. యువతకు ఉద్యోగాలు కల్పించడానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కృషి చేస్తోంది. రాబోయే రెండేళ్లలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
మరోవైపు టీచర్ పోస్టుల భర్తీ కోసమై ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటనకు సిద్ధమైంది. అతి త్వరలో 16 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ అనౌన్స్ చేయనున్నారట.
No comments:
Post a Comment